(వడ్డేపల్లి సభాపతి, జనరక్షణ న్యూస్, ప్రతినిధి)
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే, రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీలో ఉంటారు అనే అంశం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఇక్కడ నుంచి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం పెద్దపల్లి కాంగ్రెస్ నుంచి కాకా వెంకటస్వామి మనుమడు, మాజీ ఎంపీ, ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకు గడ్డం వంశీకృష్ణ పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. ప్రస్తుతం మారిన సమీకరణాలకు అనుగునంగా వంశీకృష్టను పెద్దపల్లి పార్లమెంటు నుంచి నిలబెడితే గెలుపు సులభమవుతుందని పలు సర్వేలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న ఎంపీని మరోసారి రంగంలో దించడానికి ఆ పార్టీ సిద్దంగా లేనట్లు సమాచారం. అలాగే బీజేపీ నుంచి ఇప్పటి వరకు ధీటైన అభ్యర్థి పెద్దపల్లి బరిలో లేడు. ఇప్పుడు కూడా ఎవరిని దించాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. పెద్దపల్లి పార్లమెంటులో గడ్డం ఫ్యామిలీని ఢీకొట్టే నాయకుడు ఎవరనే చర్చలోనే బీఆర్ఎస్, బీజేపీ ఉన్నట్లు సమాచారం. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి చాలా మంది పోటీలో ఉండటానికి సిద్దపడినప్పటికీ, పెద్దపల్లి పార్లమెంటు ఇప్పుడు రాష్ట్రంలోనే ఓ సెన్సెషన్గా మారింది, అలాంటి చోట నామ్కే వాస్తే అనే విధంగా అభ్యర్థులను పెట్టకూడదనే బీజేపీ, బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు ఓ రణరంగాన్ని తలపిస్తుందనడంలో సందేహం లేదు.
